Tuesday, 27 September 2011

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది.

సెప్టెంబర్‌ 1998 వ సంవత్సరంలో ఒక ప్రైవేటు ఆధీనములో ఉన్న కార్పోరేషను గా స్థాపించబడింది. మౌంటెన్ వ్యూ, కాలిఫోర్నియాలో ఉన్న ఈ కంపెనీలో సుమారుగా 19,604 మంది పనిచేస్తారు. ఇదివరకు నోవెల్‌ కంపెనీ సీఈవో (CEO)గా పనిచేసిన ఎరిక్‌ ష్మిడ్త్‌ ప్రస్తుత గూగుల్‌ సీఈవో.

గూగుల్‌ అనే పదం గూగోల్‌ అనే పదం నుంచి వచ్చింది. గూగోల్‌ అనేది ఒకటి పక్కన వంద సున్నాలు గల సంఖ్య. కాలిఫోర్నియాలో ఉన్న గూగుల్‌ ప్రధాన కార్యాలయాన్ని గూగుల్ప్లెక్స్‌ (1 తర్వాత 10వేల సున్నాలు కల సంఖ్య) అని అంటారు.

గూగుల్‌ యొక్క సేవలు ఎన్నో సర్వర్‌ క్షేత్రాల మీద పనిచేస్తాయి. ఒక్కో సర్వర్‌ క్షేత్రం ఎన్నో వేల స్ట్రిప్ చేసిన లినక్సు వర్షన్ల మీద పనిచేస్తాయి. కంపెనీ ఆ వివరాలు వెల్లడించదు కానీ సుమారుగా ఒక లక్ష లినక్స్ యంత్రాలను ఉపయోగిస్తుందని అంచనా. నీల్సెన్ కాబినెట్ ప్రకారం ఇతర శోధనాయంత్ర ప్రత్యర్ధులు, యాహూ (23%), ఎమ్.ఎస్.ఎన్‌ (13%)ను దాటి 54% మార్కెట్‌ వాటా కలిగి ఉంది గూగుల్‌. గూగుల్ రోజుకి ఒక వంద కోట్ల అభ్యర్ధనలను స్వీకరిస్తుంది!
 
గూగుల్ యొక్క ప్రధాన వ్యాపారం ఇంటర్నెట్ సెర్చ్ ఇంజన్ మీదే ఆధారపడి ఉంది. దీనిలో ముఖ్య పదాల ఆదారంగా సంభందిత అంశం గుర్చిన సమాచారం(వెబ్సైటులు) తో పాటు చిత్రాలను, వార్తా విశేషాలతో పాటూ పరిశీలన చేయబడిన శాస్త్రీయ వ్యాసాలకు సందించిన సమాచారం కొరకు కూడా వెతకవచ్చు.

"ఇరవై శాతం" సమయం: 

ప్రతీ గూగుల్ ఇంజనీరు తమ పని గంటలలో 20 శాతం సమయాన్ని తనకు నచ్చిన ప్రాజెక్ట్ పైన పని చేసే వీలు కల్పించబడింది.ఈ సమయాన్ని వారంలో ఒక రోజు కానీ మొత్తం కేటాయించిన సమయాన్ని సమీకరించి ఒక నెలగా కానీ వాడుకోవచ్చు. ఇలాంటి స్వయంసిద్ధ కృషి వలన జనించినవే ఆధునిక గూగుల్ పరికరాలు అయిన జీమెయిల్, గూగుల్ న్యూస్,ఆర్కుట్ లాంటి సేవలు. 


ఐ.పి.ఓ మరియు గూగుల్ వ్యవహారిక సంస్కృతి:
చాలా మంది గూగుల్ ఐ.పి.ఓ తో కంపెనీ కల్చర్ లో మార్పు వస్తుందని ఊహించారు, ఉద్యోగుల ప్రయోజనాలు షేర్ హోల్డర్ల ఒత్తిడి వలనో, లేక కాగితం మీద కోటీశ్వరులవడం మూలానో మారవచ్చని ఊహించారు.. కానీ అలాంటివీ ఐ.పీ.ఓ వల్ల జరగవని గూగుల్ సృష్టికర్తలయిన సెర్గీ బ్రిన్ మరియు లారీ పేజ్ లు ఒక నివేదికలో పేర్కొన్నారు.  తరవాత పేజ్ "మేము మా సంస్కృతి, సరదా తత్వం కాపాడటానికి చాలా ఆలోచిస్తామని" అన్నారు.

గూగుల్ పెరుగుతున్నకొద్దీ ఆ సంస్థ "కార్పొరేట్" లాగా అవుతుందని చాలా మంది విశ్లేషకులు అంటున్నారు. 2005 వ సంవత్సరములో ప్రముఖ అమెరికా ఇంగ్లీష్ దినపత్రిక ది న్యూయార్క్ టైమ్స్, ఇంకా ఇతరులు గూగుల్ వ్యతిరేక వ్యాపారీకరణ(యాంటీ కార్పొరేట్), చెడు చెయ్యకూడదనే తత్వం కోల్పోయిందని చెబుతున్నారు.


--

Saturday, 17 September 2011

హైదారాబాదు పై పొలిసు చర్య.. "OPERATION POLO"

హైదారాబాదు పై పొలిసు చర్య..
1946 1948ల మధ్య హైదరాబాదు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పట్ల ఆంధ్రులు కలత చెందారు. హైదరాబాదుకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలని ఆసిస్తూ, దాన్ని ప్రత్యేక దేశంగా గుర్తించాలని నిజాము ప్రతిపాదించాడు. ఇత్తెహాదుల్‌ ముస్లిమీను, దాని సైనిక విభాగమైన రజాకార్ల కు చెందిన ఖాసిం రజ్వి ద్వారా దీన్ని సాధించాలని నిజాము ప్రయత్నించాడు.

రాష్ట్రానికి చెందిన అధిక శాతం ప్రజలు భారతదేశంలో కలిసిపోవాలని ఉద్యమం మొదలుపెట్టారు. స్వామి రామానంద తీర్థ నాయకత్వంలో కాంగ్రెసు నాయకులు ఉద్యమంలో పాలుపంచుకునారు. రాష్ట్ర కాంగ్రెసును నిజాము నిషేధించడం చేత, ఈ నాయకులు విజయవాడ, బొంబాయి వంటి ప్రదేశాల నుండి ఉద్యమాన్ని నడిపించారు. రజాకార్ల దాడులను ఎదుర్కోడానికి కమ్యూనిస్టులు గ్రామ రక్షక దళాలను ఏర్పాటు చేసారు.

భారత ప్రభుత్వానికి, నిజాముకు మధ్య జరిగిన అన్ని చర్చలూ విఫలమయ్యాయి. భారత దేశంలో విలీనానికి నిజాము అంగీకరించలేదు. మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ మరియు రాజాకార్ల కార్య కలాపాలు శాంతికి, సామరస్యానికి భంగకరంగా తయారయ్యాయి. వాస్తవ పరిస్థితిని నిజాముకు అర్ధమయ్యేలా చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి, 1947 నవంబర్‌ 29న యథాతథ స్థితి ఒప్పందం కుదిరింది. 1947 ఆగష్టు 15కు పూర్వపు పరిస్థితికి ఒక సంవత్సరం పాటు కట్టుబడి ఉండాలనేది ఈ ఒప్పంద సారాంశం. ఒప్పందంలో భాగంగా హైదరాబాదులో భారత్ తరపున ఏజంట్ జనరల్‌గా కె.ఎం.మున్షీ నియమితుడయ్యాడు. విదేశాల్లో ఆయుధాలు కొనుగోలు చేసి, హైదరాబాదుకు దొంగతనంగా తరలించే సమయం పొందడమే ఈ ఒప్పందంతో నిజాము ఉద్దేశ్యం. ఈలోగా పరిస్థితిని ఐక్యరాజ్యసమితి యొక్క భద్రతా సమితికి నివేదించడానికి నిజాము ఒక బృందాన్ని పంపించాడు.

1948 ఆగష్టు 9  టైంస్‌ ఆఫ్‌ లండన్‌ లో వచ్చిన వార్త ప్రకారం హైదరాబాదు 40,000 సైన్యాన్ని, ఆయుధాలను సమకూర్చుకుంది. హైదరాబాదు ప్రధాన మంత్రి లాయిక్‌ ఆలీ ఇలా అన్నాడు భారత ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి లక్ష మందితో సైన్యం సిద్ధంగా ఉంది, బొంబాయిపై బాంబులు వెయ్యడానికి సౌదీ అరేబియా కూడా సిద్ధంగా ఉంది

నిజాము చేపట్టిన ఈ చర్యలకు తోడు రజాకార్ల హింస, హైదరాబాదుపై పోలీసు చర్యకు కేంద్ర ప్రభుత్వం నడుం కట్టింది. 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై పోలీసు చర్య మొదలైంది. దీనికి ఆపరేషన్ పోలో అని పేరు పెట్టారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వంలో భారత సైన్యం మూడు వైపుల నుండి హైదరాబాదును ముట్టడించింది.1948 సెప్టెంబర్ 18న నిజాము లొంగిపోయాడు. పోలీసు చర్య ఐదు రోజుల్లో ముగిసింది. 1373 మంది రజాకార్లు హతమయ్యారు. మరో 1911 మంది బందీలుగా పట్టుబడ్డారు. హైదరాబాదు సైన్యంలో 807 మంది చనిపోగా, 1647 మంది పట్టుబడ్డారు. భారత సైన్యం 10 మంది సైనికులను కోల్పోయింది. ఆతని ప్రధానమంత్రి మీర్‌ లాయిక్‌ ఆలీ, రజాకార్ల నాయకుడు ఖాసిం రజ్వీ అరెస్టయ్యారు. తరువాత ఖాసిం రిజ్వీ కొన్నాళ్ళు భారత దేశంలో జైలు జీవితం గడిపి, విడుదలయ్యాక, పాకిస్తాను వెళ్ళి స్థిరపడ్డాడు. కొన్నాళ్ళకు అక్కడే అనామకుడిలా మరణించాడు.

సెప్టెంబర్ 23న భద్రతా సమితిలో తన ఫిర్యాదును నిజాము ఉపసంహరించుకున్నాడు. హైదరాబాదు భారతదేశంలో విలీనం అయినట్లుగా ప్రకటించారు. మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి హైదరాబాదు సైనిక గవర్నరుగా బాధ్యతలు స్వీకరించి, 1949 చివరి వరకు ఆ పదవిలో ఉన్నారు.

ప్రజా ప్రభుత్వ ఏర్పాటు:
1950 జనవరిలో ఎం.కె.వెల్లోడి అనే సీనియరు ప్రభుత్వ అధికారిని ముఖ్యమంత్రిగా నియమించి, నిజామును రాజ్‌ ప్రముఖ్‌ గా ప్రకటించారు. 1952 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చింది.




--