Saturday, 28 January 2017

I'm back ...latest posts coming soon


Friday, 21 September 2012

తెలుగు జాడ.. గురజాడ! 1862 సెప్టెంబర్ 21 - నేడు 150వ జయంతి .


దేశమంటే దేశమంటే
మతం కాదోయ్, గతం కాదోయ్
అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్నచేతి గన్ను కాదోయ్
క్షుద్రవేదం పాడుతున్న ఉగ్రవాదం కాదు కాదోయ్
తీవ్రవ్యాధిగ మారుతున్న తీవ్రవాదం కాదు కాదోయ్
దేశమంటే
గడ్డి నుండి గగనమంటిన కుంభకోణం కాదు కాదోయ్
చట్ట సభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదోయ్
రాజధనుల రాచభవనపు రాసలీలలు కాదు కాదోయ్
అబలపై ఆమ్లాన్ని జల్లే అరాచకమే కాదు కాదోయ్
పరిధి దాటిన గాలి వార్తల ప్రసారాలు కాదు కాదోయ్
సందు దొరికితే మంది చేసే సమ్మె కాదోయ్ బందు కాదోయ్
ప్రాణ ధన మానాలు తీసే పగల సెగల పొగలు కాదోయ్
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
ద్వేషమెందుకు సాటి మనిషిని సోదరుడిగా ఆదరించు
హింసలెందుకు సమస్యలను నవ్వుతూ పరిష్కరించు
క్రోధమెందుకు కరుణ పంచు
స్వార్ధమెందుకు సహకరించు
పంతమెందుకు పలకరించు
కక్షలెందుకు కౌగిలించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
మల్లె పువ్వుల లాంటి బాలల తెల్ల కాగితమంటి బ్రతుకులు
రక్త చరితగ మారకుండా రక్ష కలిగించు
కొత్త బంగరు భవిత నీదే కానుకందించు
ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు
దేశమంటే
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్
దేశమంటే
దేశమంటే మనుషులోయ్
'దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్'... అని నినదించిన ఘనుడు! తేట తెలుగు అక్షరాలను 'ముత్యాల సరాలు'గా పేర్చిన కవివర్యుడు! పుత్తడి బొమ్మ పూర్ణమ్మ కష్టాలకు పాట కట్టిన పరిపూర్ణుడు! నేటి కాలపు మోసగాళ్లకు, ఒట్టి మాటగాళ్లకు ప్రతినిధిగా ఆనాడే 'గిరీశం' అనే పాత్రను సృష్టించిన కలం యోధుడు... తెలుగు వారికి వెలుగు జాడై నిలిచిన గురజాడ అప్పారావు 150వ జయంతి శుక్రవారమే. 1862 సెప్టెంబర్ 21న ఆయన జన్మించారు. వర్తమానం నుంచి వందేళ్లు ముందుకెళ్లి రచనలు సాగించిన మహాకవి. రవీంధ్రనాథ్ టాగూర్, భారతియార్ దేశభక్తి గీతాలు రాసినప్పటికీ వాటిలో ప్రాంతాలు, దిక్కులు మాత్రమే ఉన్నాయి. 

కానీ... గురజాడ 'దేశమంటే మట్టికాదు.. దేశమంటే మనుషులు' అని ఆ ఎల్లలు చెరిపేశారు.
"నన్న య్య గతం తెలిపిన రచయిత. శ్రీశ్రీ రచనలు భవిష్యత్‌ను తెలిపా యి. గురజాడ మాత్రం వర్తమానం తెలిపిన కవి. ఆయన తెలుగు వారి సోక్రటీస్''. 
from swapnamahi.blogspot.com


ఆధునిక మహిళ భారతదేశ చరిత్రను పునర్లిఖిస్తుంది-గురజాడ అప్పారావు
తాంబూలాలిచ్చేశాను, ఇక తన్నుకు చావండి
డామిట్‌! కథ అడ్డంగా తిరిగింది
పొగ తాగనివాడు దున్నపోతై పుట్టున్‌
గురజాడ అప్పారావు గురించి వినని వారు వుంటారేమో గానీ, కన్యాశుల్కం నాటకంలో ఆయన సృజించిన ఈ వాక్యాలు వినని తెలుగు వారు వుండరు. ఈనాటకంలో ఆయన సృష్టించిన గిరీశం, మధురవాణి, రామప్పంతులు మొదలైన పాత్రలు కూడా అంతే ప్రఖ్యాతి పొందాయి.

గురజాడ అప్పారావు
తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు.


వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు.

జీవిత విశేషాలు:

గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం (ఎలమంచిలి) గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 వ తేదిన అప్పారావు మతామహుల ఇంట జన్మించారు.. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లి లో పదేళ్ళ వరకు చదివాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.

1884
లో మహారాజ కాలేజి వారి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1885 లో అప్పలనరసమ్మ గారితో వివాహమైంది. 1886 లో డిప్యూటీ కలెక్టరు ఆప్ఫీసులో హెడ్‌ క్లర్కు పదవినీ, 1887 లో కళాశాల లో అధ్యాపక పదవిని నిర్వహించాడు. 1886 లో రాజా వారి ఆస్థానంలో చేరాడు. 1911 లో మద్రాసు యూనివర్సిటీ లోని బోర్డ్‌ ఆఫ్‌ స్టడీస్‌ లో సభ్యత్వం లభించింది.


గిడుగు రామమూర్తి తో కలిసి వాడుక భాషా వ్యాప్తికి ఉద్యమించాడు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కన్యాశుల్కం నాటకాన్ని 1890 ప్రాంతాల్లో పూర్తి వాడుక భాషలో రచించాడు (ఖచ్చితమైన సంవత్సరం తెలియ రాలేదు). ఆ రోజుల్లో ప్రబలంగా వున్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు. 1892 లో నాటకపు తొలి ప్రదర్శన జరిగింది. 1897లో కన్యాశుల్కం తొలి కూర్పును మహారాజా ఆనందగజపతికి అంకితమిచ్చాడు. ఇప్పుడు మనకు దొరుకుతున్న కన్యాశుల్కం రెండవ కూర్పును 1909 లో రచించాడు.

53 సంవత్సరాల వయసులో 1915 నవంబర్ 30 న గురజాడ అప్పారావు మరణించాడు. ఆయనకు ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు.

»мαнι ℓσνє'ѕ υ« ミConnecting People彡


Thursday, 26 July 2012

రికార్డులు నెలకొల్పిన ప్రతిభాపాటిల్

దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన తొలి మహిళ ప్రతిభా దేవీసింగ్ పాటిల్. సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ఆమే. రాష్ట్రపతిగా 24 సార్లు విదేశాల్లో పర్యటించిన ఘనత కూడా ఆమెకే దక్కింది. 12వ రాష్ట్రపతి అయిన ఆమె పదవీ కాలం రేపటితో (జూలై 25) ముగియనుండటంతో నిన్న (23న) పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో లోక్ సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఘనంగా వీడ్కోలు పలికారు.

ప్రతిభా పాటిల్‌ 1934 డిసెంబర్‌ 19న మహారాష్ట్రలోని జల్‌గావ్ జిల్లాలోని నంద్ గావ్ గ్రామంలో జన్మించారు. జల్‌గావ్ లో ఆమె రాజనీతి శాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ పొందారు. బాంబే లా కాలేజ్‌ నుంచి లా డిగ్రీ పొందారు. క్రీడల్లో ఆమెకు బాగా ఆసక్తి కనబరిచేవారు. టేబుల్‌ టెన్నిస్‌లో ఆమె చాలా అవార్డులు కూడా గెలుచుకున్నారు.

జల్‌గావ్‌ జిల్లా కోర్టులో న్యాయవాదిగా ఆమె తన ప్రాక్టీస్‌ ప్రారంభించారు. పేద మహిళల సమస్యలు తీర్చడంలో ఆమె ముందుండేవారు. 27 ఏళ్ళ వయస్సులోనే ఆమె మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో పోటీ చేశారు. 1985 వరకూ ముక్తాయ్‌ నగర్‌ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా వరుసగా నాలుగుసార్లు గెలుపొందారు. 1985 నుంచీ 90 వరకూ ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 1991లో పదో లోక్‌సభకు అమ్రావతి నుంచి ఎన్నికయ్యారు. 1967 నుంచీ 80 వరకూ మహారాష్ట్ర ప్రభుత్వంలో వివిద మంత్రి పదవులు అధిష్టించారు. 1979 జూలై నుంచి 1980 ఫిబ్రవరి వరకు ఆమె మహారాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష నేతగా కూడా వ్యవహరించారు. 1986 నుంచీ 88 వరకూ రాజ్యసభలో డిప్యూటీ చైర్‌ పర్సన్‌గా కొనసాగారు. 1988 నుంచీ 90 వరకూ మహారాష్ట్ర పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.

2007 జులై 25న రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు ఆమె రాజస్థాన్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఆ నాటి యూపిఏ రాష్ట్రపతి అభ్యర్ధి ప్రతిభాపాటిల్‌కు వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. ఎన్‌డిఏ భాగస్వామ్యపక్షం శివసేన కూడా మరాఠా వాదం పేరుతో ఆమెకే మద్దతిచ్చింది. దీంతో ఆమె ఎన్‌డిఏ అభ్యర్ధి, నాటి ఉపరాష్ట్రపతి బైరాన్‌సింగ్‌ షెకావత్‌పై భారీ మెజార్టీతో గెలుపొందారు. రాష్ట్రపతి పదవి చేపట్టిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. రాష్ట్రపతిగా ఐదేళ్ళ పదవీకాలం పూర్తి చేసుకున్న ప్రతిభాపాటిల్‌ తన హయాంలో 24 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. దేశ విదేశాల్లో భారత వాణిని బలంగా వినిపించారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాంను ఆదర్శంగా తీసుకున్న ఆమె సుఖోయ్‌ యుద్ధ విమానంలో 30 నిమిషాల పాటు ప్రయాణించి రికార్డు సృష్టించారు. ఇలా సుఖోయ్‌లో ప్రయాణించిన పెద్ద వయస్కురాలు కూడా ప్రతిభాపాటిలే కావడం విశేషం. 

తమ పదవీకాలంలో ప్రతిభా పాటిల్‌ 35 మంది ఖైదీల మరణశిక్షను జీవిత కాల శిక్షగా మార్చారు. ప్రతిభాపాటిల్‌ పదవిలో ఉండగానే ఆమె భర్త దేవీసింగ్‌ రాణీసింగ్‌ షెకావత్‌పై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. మహారాష్ట్రలోని పూణేలో రక్షణశాఖకు చెందిన భూమిని కారుచౌకగా పొందాలని చూశారని ప్రతిభ కుటుంబసభ్యులపై ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆమె ఆ భూమిని తీసుకోరాదని కూడా నిర్ణయించుకున్నారు. మహారాష్ట్రలో ఇటీవలి ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అయిన ప్రతిభ తనయుడి కారులో పెద్ద మొత్తంలో డబ్బు దొరకడం సంచలనం సృష్టించింది. రిటైర్‌మెంట్‌ తర్వాత ప్రతిభాపాటిల్‌ ఢిల్లీలో కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ నివాసానికి పక్కనే ఉన్న భవనంలోకి మారనున్నారు.

Tuesday, 29 May 2012

అకృత్య చక్రవర్తి - క్లాడియస్ సీజర్ అగస్టస్ జెర్మానికస్ అనే పూర్తి పేరు కలిగిన నీరో!

అకృత్య చక్రవర్తి

ఓ పక్క రోమ్ నగరం కాలి బూడిదైపోతోంది. ఇంకోపక్క నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకుంటూ కూచున్నాడు. ఇది చాలు నీరో ఎలాంటి వ్యక్తో చెప్పడానికి! నీరోకి కళలంటే తగని మక్కువ. విచ్చలవిడితనం ఎక్కువ. నీరో ఓ వైపు సంగీతకారుడు. మరోవైపు క్రూరుడు. సమర్థ నాయకత్వ లక్షణాలున్నాయి. కాని వాటిని పట్టి ఉంచుకోగల బుద్ధి విచక్షణ లేదు.

ఓ పట్టాన అర్థం కాని వ్యక్తిత్వం నీరోది. జవాబుల్లేని ప్రశ్నలెన్నో నీరో జీవితంలో! 30 యేళ్లు మాత్రమే జీవించినా - రోమన్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే సంచలనం సృష్టించిన చక్రవర్తి - క్లాడియస్ సీజర్ అగస్టస్ జెర్మానికస్ అనే పూర్తి పేరు కలిగిన నీరో!


నీరో పొడగరి కాదు. ఒంటి నిండా మచ్చలు. ఎప్పుడూ శరీరం నుండి ఏదో భరించలేని వాసన. రాగిరంగు జుట్టు. నీలం రంగు కళ్లు. అవి కాంతిలేని గాజు కళ్లకు నకళ్లు. పైగా కొద్దిగా మెల్ల. మెడ కొంచెం మందం. పైకి పొడుచుకు వచ్చిన పొట్ట. సన్నని కాళ్లు. దేహంలోని ఏ భాగమూ స్ఫుటంగా, తీరుగా ఉండవు. అయినా ఏదో తెలీని ఆకర్షణ, అందమూ!

నీరో అచ్చమైన కవి. సిసలైన గాయకుడు. బాణీలు కట్టి మాటల్ని పాటలుగా అల్లిన సంగీతకారుడు. లైర్ అనే వాద్య పరికర తంత్రుల్ని మీటుతూ రాగామృతంలో మునిగిపోయిన భావుకుడు. నాట్యం చేస్తూ ఊగిపోయిన ఉద్రేకుడు. నటుడు. తనలోని కళల్ని నలుగురికీ చూపించాలని తపించేవాడు. రసజ్ఞుల చప్పట్లకై మురిసిపోయిన అమాయకుడు. 

కాని వేదిక ఎక్కాలంటే మాత్రం తెగ భయం. సభాకంపంతో చాలాసార్లు ప్రదర్శనల్ని రద్దు చేసుకున్నాడు. చివరకు తెగించి క్రీ.శ.64లో 27వ యేట నియోపాలిస్ పట్టణంలో తొలి కచేరీ ఇచ్చాడు - అదీ చక్రవర్తి అయి ఉండి! ఆ రోజు వేలాది ప్రజలు నీరోని హీరోగా ఆరాధించారు. 

పాలకుడిగా కూడా మంచి మార్కులే పడతాయి నీరోకి. పేదలకు పన్నుల భారం తగ్గించాడు. అవినీతిని అరికట్టాడు. నైలునది పుట్టుకను తెలుసుకునేందుకు ఎంతో ఖర్చుపెట్టి పరిశోధనా యాత్రలు ఏర్పాటు చేశాడు. కాలువలు తవ్వించాడు. జిమ్‌లు, థియేటర్లు కట్టించాడు. ఖడ్గయుద్ధ ప్రదర్శనల్ని ఏర్పాటు చేశాడు.

రోమన్ అయినా గ్రీకు సంస్కృతి అంటే మాత్రం నీరోకి చెప్పలేనంత ఇష్టం. గ్రీకు భాషను ధారాళంగా మాట్లాడేవాడు. వస్త్రధారణలో గ్రీకుల్ని అనుకరించేవాడు. ఒలింపిక్స్ తరహాలోనే రోమ్‌లో కూడా నిరోనియా అనే పేరుతో క్రీడోత్సవాల్ని అంబరాన్ని తాకే సంబరంగా జరిపేవాడు.
గ్రీసు దేశంలో జరిగే ఒలింపిక్స్‌లో పాల్గొనాలని తహతహలాడేవాడు. బోలెడన్ని బహుమతులు గెలవాలని ఉబలాటపడేవాడు. సంగీత పాటవ పోటీల్లో ఎలాగూ తానే గెలుస్తానని తెలుసు.
రథాల పోటీలో కూడా విజేతగా నిలవాలనుకున్నాడు. అక్కడేమో పది గుర్రాల్ని పూన్చిన రథాన్ని నడపాలి. తనకేమో ఒక్క గుర్రం మాత్రమే ఉండే రథాన్ని నడపడమే తెలుసు. కఠోర సాధన చేస్తుండగానే ఒలింపిక్స్ క్రీడలొచ్చేశాయి. దాంతో అధికారులకు మూడో కంటికి తెలీకుండా లంచాలిచ్చి రెండేళ్లు వాయిదా వేయించాడు. అంతలో దశాశ్వ రథ చోదనంపై పట్టు సాధించాడు.

చివరకు క్రీ.శ.67లో ఆ పోటీల్లో పాల్గొన్నాడు. అన్నింటిల్లోనూ విజయమే పొందాడు. రథ చోదనంలో మాత్రం చాలాసార్లు కిందపడ్డాడు. చావు తప్పి కన్ను లొట్టబోయింది. అయినా అందులోనూ గెలిచాడు. ఘనమైన రోమ్ చక్రవర్తి స్థానంలో ఉండి ఏకంగా 1800 గ్రీకు పతకాలు సాధించాడు.

ముగింపు వేడుకల్లో గ్రీకుల్ని ఉద్దేశించి ఉపన్యసించాడు. ఆ ఆవేశంలో, ఆనందంలో గ్రీకులకు అనేక రాయితీలు ప్రకటించేశాడు. అది కాస్తా రోమన్లకు ఆగ్రహాన్ని కలగజేసింది. అప్పటికే కళాపోషణలో పడి ప్రజారక్షణ, సంరక్షణ మరిచిపోయిన నీరోని రోమన్లు జీరోని చేశారు.
ఎన్నో ఉత్తమ గుణాలున్నప్పటికీ నీరో కథ విషాదాంతమవడానికి కారణం - అతని తల్లి అంటే ఆశ్చర్యం వేస్తుంది.

నీరో తల్లి అగ్రిప్పినా. తన కడుపున క్రీ.శ. 37 డిసెంబర్ 15న నీరో పుట్టిన నాటి నుంచి ఆ పిల్లాడు రోమ్ చక్రవర్తి కావాలని కలలు కంది. అగ్రిప్పినా అసాధారణ అందగత్తె. తెలివైనది. దురాశాపరురాలు. ఎంతకైనా తెగించే హింసాప్రవృత్తి ఆమెది. అధికార దాహం మెండు. ఆమెకు కుడివైపు పై దవడలో రెండు కోరపళ్లున్నాయి. అది అదృష్టమని రోమన్లు నమ్ముతారు.
భర్త గ్నాయెస్ డొమిటెస్ అహెనో బార్బస్‌తో ఆమె కొంతకాలమే కాపురం చేసింది. 

తర్వాత మరొకర్ని పెళ్లి చేసుకుని వెంటనే వదిలేసింది. తన పుత్రుణ్ని గద్దెనెక్కించేందుకు మార్గాల్ని అన్వేషించింది. అప్పటికి సింహాసనంపై క్లాడియస్ ఉన్నాడు. అతనెవరో కాదు - అగ్రిప్పినాకు పెదనాన్న. అతణ్ని చేసుకుంటే - వారసుడిగా తన కొడుకుని రోమ్ చక్రవర్తిని చేయొచ్చు. అంతే. వెంటనే క్లాడియస్‌ను పెళ్లి చేసుకొంది. అతనికి నాలుగో భార్యగా వెళ్లడానికి ఏమాత్రం వెనుకాడలేదు. తనకు అతగాడు మూడో జతగాడు కదా. పర్లేదు!

తన కొడుకు రేపోమాపో చక్రవర్తి అవుతాడు. అయితే సరిపోదు. నిలబడాలి. శాశ్వతంగా చక్రం తిప్పాలి. అలా జరగాలంటే ఎక్కడ నొక్కాలో చెక్కాలో మొక్కాలో తొక్కాలో తెలియాలి. అందుకోసం సెనెకా అనే ప్రత్యేక రాజగురువుని నియమించింది.
రాజనీతిపై గట్టి పట్టున్నవాడు సెనెకా. చక్రవర్తి క్లాడియస్ మేనకోడలు జూలియా లివిల్లాతో వివాహేతర సంబంధం మూలాన రాజదర్బారు నుంచి బహిష్కరణకు గురైనవాడు సెనెకా. అలాంటి వాడికే తెలుస్తాయి - కుట్రలూ కుతంత్రాలూ.

అలాంటి గురువు చేత - 10 యేళ్లు కూడా నిండని నీరోకి, రెక్కలు ఎదగని కోమలుడికి, కళలంటే పిచ్చి అభిమానమున్న బాలుడికి, మార్దవుడికి - కర్కశత్వాన్ని, కాఠిన్యాన్ని, అధికార లాలసను నేర్పించడం మొదలెట్టింది అగ్రిప్పినా! పిల్లల్ని మార్కుల కోసం చెండాడే నేటి తల్లుల్లా!!
ఏడేళ్లు ఎదురుచూసింది అగ్రిప్పినా. 

నీరో మేజర్ అయ్యాడు - ఆనాటి రోమన్ సూత్రాల ప్రకారం చక్రవర్తి అయ్యే వయసుకి వచ్చాడు. ఓ శుభదినాన భర్త క్లాడియస్‌ను అగ్రిప్పినా చంపించింది - పుట్టగొడుగుల్లో విషాన్ని కలిపి! కొడుకు చక్రవర్తి కావడానికి రాచమార్గం వేసింది. క్రీ.శ. 54 అక్టోబర్ 13న 17 యేళ్ల నీరో పీఠాన్ని అధిరోహించాడు.

కొడుకు చక్రవర్తి అయ్యాక చక్రం తిప్పాలనుకుంది అగ్రిప్పినా. కాని అనూహ్యంగా ఆమెకు అడ్డం పడ్డాడు సెనెకా. సవతి సోదరి క్లాడియా ఆక్టావియాతో నీరోకి పెళ్లి చేసింది అగ్రిప్పినా. వావి వరసలు లేని ‘అగమ్య గమనం’ అనే వివాహాలు నాటి రోమన్లకు సంప్రదాయమే! కాని వైవాహిక జీవితం అంతగా సంతృప్తినివ్వలేదు నీరోకి. దాంతో పనిమనిషి క్లాడియా ఆక్టేతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నీరో. తన స్నేహితుడు ఓథో భార్య పాపియా సబీనాతోనూ ఇలాగే ప్రవర్తించాడు. 

మొదట్లో తల్లి మాట విన్నాడు నీరో. క్రమంగా నువ్వెవరివి అని ఎదురు ప్రశ్నించాడు. రాజగురువు సెనెకా నీరోకే మద్దతిచ్చాడు. దాంతో అగ్రిప్పినాకు ఒళ్లు మండింది. సొంత కొడుకని కూడా చూడకుండా నీరోని గద్దె దింపాలని పంతం పట్టింది. నీరోకి సవతి సోదరుడైన బ్రిటానికస్‌ని చక్రవర్తిని చేయాలనుకుంది. కాని ఆ కుర్రాడు మేజర్ కాబోవడానికి ముందురోజే చనిపోయాడు. కాదు... కాదు... నీరోయే చంపించేశాడు.

దాంతో అగ్రిప్పినా తోక తొక్కిన తాచుపామయింది. పాలనా వ్యవహారాల్లో మునుపటికి మించి తలదూర్చింది. చివరకు నీరో ఆమెను హత్య చేయించేదాకా కథ ముదిరింది. మూడుసార్లు తల్లిపై విషప్రయోగం చేశాడు. ఆమె ఇంకా తెలివైంది! విరుగుడు ఔషధాన్ని సేవించి బయటపడింది. ఓసారి ఆమె ఓడలో మునిగిపోయేలా చేశాడు నీరో. బతికి బట్టకట్టింది. చివరకు తల్లినే ఉరితీసి ఆత్మహత్యగా చిత్రించాడు నీరో! నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష!!

క్రీ.శ. 64 జూలై 18. రోమ్ నగరం తగలబడిన రోజు. ఆగ్నేయ మూల బాణసంచా మూలాన రాజుకున్న రవ్వ క్షణాల్లో దావానలమైంది. ఇళ్లు, భవంతులు అన్నీ బూడిద కుప్పలయ్యాయి. నగరాన్ని నల్లటి మేఘాలు కప్పుకున్నాయి. వరసగా ఐదు రోజులు మంటలే మంటలు. నీరోయే ఈ అకృత్యానికి కారణమని అంతా అనుకున్నారు. డోమస్ ఆరియా అనే మహా అద్భుత రాజప్రాసాదాన్ని నిర్మించేందుకు నీరో ఈ దారుణానికి ఒడిగట్టాడంటారు.

అగ్ని కీలలు ఓ పక్క అలుముకుంటున్నా... నీరో మాత్రం ‘లైర్’ అనే వాద్యాన్ని వాయించడంలో మునిగిపోయాడు. సాక్ ఆఫ్ ఇలియం గీతాలాపన చేశాడు. ఆనాటికి ఫిడేల్ ఇంకా రూపొందలేదు. లైర్‌ని ఫిడేల్‌కు పూర్వరూపమనవచ్చు. మంటలు కాస్త తగ్గాక, నీరో సహాయ చర్యలకు పూనుకున్నాడు విచిత్రంగా! శిథిలాల కింద చిక్కుకున్న వారిని తానే స్వయంగా తీశాడు. క్షతగాత్రుల్ని రక్షించాడు. తన రాజ ప్రాసాదంలో ఆశ్రయమిచ్చాడు. ఆహారమిచ్చాడు.

అయినా ప్రజలు నమ్మలేదు. నీరోయే దోషి అన్నారు. సెనెటర్లు నీరోపై కత్తికట్టారు. అధికారం కోసం అర్రులు చాచిన వారంతా ఏకమై నీరోపై కక్ష కట్టారు. నీరోలోని విశృంఖలత్వం ప్రజాకంటకుడయ్యేందుకు కారణమైంది. చేపల్ని పట్టేందుకు బంగారు తీగల్ని ఉపయోగించేంత భోగత్వం; తల్లిని, భార్యను, చివరకు గురువు సెనెకాను సైతం హతమార్చిన క్రూరత్వం; నిత్యం స్త్రీలతో సరసాలాడిన లాలసత్వం - వెరసి నీరోని ప్రజలు అసహ్యించుకునేలా చేశాయి. చివరకు నీరో క్రీ.శ. 68, జూన్ 9న ఆత్మహత్య చేసుకునేలా చేశాయి. నీరో పలికిన చివరి మాటలు - ‘‘ఎంతటి అసహ్యకర జీవితం నాది. నాలోని కళాకారుడూ చావక తప్పదే!!’’

మొదట్లో తల్లి మాట విన్నాడు నీరో. క్రమంగా నువ్వెవరివి అని ఎదురు ప్రశ్నించాడు. రాజగురువు సెనెకా నీరోకే మద్దతిచ్చాడు. దాంతో అగ్రిప్పినాకు ఒళ్లు మండింది. సొంత కొడుకని కూడా చూడకుండా నీరోని గద్దె దింపాలని పంతం పట్టింది... నీరో తల్లి అగ్రిప్పినా