Monday, 2 May 2011

దేవాంతకులు-3: 18 ఏళ్ల క్రితమే భవిష్య వాణి

దేవాంతకులు-3: 18 ఏళ్ల క్రితమే భవిష్య వాణి
చెప్పింది బాబా కాదు!
డబ్బు మీదే ట్రస్టు సభ్యుల దృష్టంతా

బాబాను చంపడానికీ వారు వెనుకాడరు
బాబాను గొప్పవాణ్ని చేసింది తామేనంటారు
ఆయన సమాధి మీదా పైసలేరుకుంటారు
కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న ప్రభు, రవి చెప్పిన విషయాలివి...
బాబా వాస్తవాలు బయట పెడితే ట్రస్టు ఆటలు సాగవు. బాబా అలా చేస్తారనే అనుమానం కలిగితే, బాబాని హత్య చేసి, ఆయన సమాధిని భక్తులకు చూపి, దానిపై సొమ్ము చేసుకోవటానికి కూడా ట్రస్టు వారు వెనకాడరు.

ఈ మాటలు వింటుంటే, సత్యసాయి ఆసుపత్రిలో చేరిన తర్వాత ఎవరో ఈమధ్యనే అన్న మాటల్లా అనిపిస్తున్నాయా? కాదు. కానేకాదు. ఎప్పుడో 18 ఏళ్ల కిందటి మాటలివి. 1993లో సత్యసాయి బాబాపై హత్యాయత్నం కేసులో నిందితులుగా ముద్రపడ్డ ఇద్దరు వ్యక్తులు ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలివి. వారు ఆ మాటలు మాట్లాడడం విచిత్రమేమీ కాదు. కానీ 18 ఏళ్ల కిందటి ఆ మాటలు ఇప్పటి మాటల్లా వినిపించడమే విచిత్రం. అందుకు తప్పుబట్టాల్సింది ఆనాటి దాడి 'నిందితుల్ని' కాదు. ఈనాటి ట్రస్టు నిందితుల్నే!

హైదరాబాద్, మే 1 : "ప్రశాంతి నిలయమే పీకల దాకా అవినీతిలో కూరుకుపోయింది. వీళ్లంతా భౌతిక, లౌకిక ప్రయోజనాల కోసమే నా చుట్టూ చేరారు. ఈ ఆస్తులేవీ నావి కావు. ఏదో ఒక రోజు ట్రస్టు నన్నే బయటికి పంపేయవచ్చు..'' ' అక్కడ ఏముంది.. అంతా అవినీతి .. అవినీతి.. అవినీతి..'' ( సాయి ట్రస్టు అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల గురించి..) నమ్మినవారే తనను నట్టేట ముంచేస్తున్నారని తెలిసినా ఏమీ చేయలేని నిస్సహాయతతో అనేకసార్లు తన ఆత్మీయులతో సాయిబాబా స్వయంగా ఈ మాటలు అన్నారట! 1993లో సాయి మందిరంలో జరిగిన కాల్పుల సంఘటనలో నిందితులుగా ముద్రపడి, ఆనాటి నుంచీ కనిపించకుండా పోయిన బోయపాటి రవి, శాంతారాం ప్రభులు తమతో కూడా బాబా ఇలాంటి మాటలు అన్నట్లు అప్పట్లో ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

'ట్రస్టు పెత్తందార్లే అసలు కుట్రదార్లు' అనే శీర్షికతో ఒక పత్రికలో ఈ ఇంటర్వ్యూ ప్రచురితమైంది. ఈ ఇంటర్వ్యూ ఇచ్చింది నిందితులుగా ముద్రపడ్డ వ్యక్తులే కావచ్చు. కానీ, దీనిని చదివితే అందులోని అంశాలు మరీ సత్యదూరం కావని ఆనాటి పరిణామాలు, నేటి పరిస్థితుల్ని బట్టి కచ్చితంగా అనిపిస్తుంది. ఆనాటి ఇంటర్వ్యూలో బోయపాటి రవి, శాంతారాం ప్రభు చెప్పిన విషయాలివీ...

ట్రస్ట్ చేతిలో బాబా బందీ

"భగవత్ స్వరూపుడైన బాబా లౌకిక విషయాల్లో ప్రమేయం పెట్టుకోకపోవడాన్ని ఆసరాగా తీసుకొని, పెత్తందారులు తాము చేసే పనులన్నీ బాబా ఆమోదంతోనే జరుగుతున్నాయన్న భ్రమ కల్పిస్తున్నారు. బాబా సందేశాలకు వక్రభాష్యం చెప్పి తప్పుడు ప్రచారం వచ్చేలా చూసిన వారిలో కస్తూరి ముఖ్యుడు. ప్రశాంతి నిలయంలో పెత్తందార్లంతా ప్రతి సందర్భంలోను తమ లక్ష్యాలకు బాబా పేరు వాడుకుంటున్నారు.''

బాబాకూ ప్రాణగండం..

"బాబా వాస్తవాలు బహిర్గతం చేస్తారనుకుంటే ట్రస్టు అధికారులు బాబాని హత్య చేయటానికి కూడా వెనకాడరు. బాబా అంటే ఏ మాత్రం భక్తి, గౌరవం లేనివారు కేవలం డబ్బు, పెత్తనం కోసమే బాబాని అడ్డుపెట్టుకున్నారు. బాబా వాస్తవాలు బయటపెడితే ట్రస్టు ఆటలు సాగవు. బాబా అలా చేస్తారనే అనుమానం కలిగితే బాబాని హత్య చేసి ఆయన సమాధిని భక్తులకు చూపి దానిపై సొమ్ము చేసుకోవటానికి కూడా వెనకాడరు''

బాబా పని అయిపోయింది..

"ట్రస్టుకు కాంగ్రెస్‌తోను, పోలీసులతోను సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. బాబాపై హత్యాప్రయత్నం జరిగితే, ట్రస్టు అధికారులకు సెక్యూరిటీ ఎందుకు ఏర్పాటు చేస్తారు? బాబా పేరుతో ట్రస్టు సభ్యులు, అధికారులు స్వప్రయోజనాలు నెరవేర్చుకుంటున్నారు. సాయి పట్ల వారికి భక్తి లేదు. 'బాబా పని అయిపోయిందని' ట్రస్టు వారు బాహాటంగానే అంటున్నారు.

సత్యసాయి మౌనం, మంచితనమే కొందరు పెత్తందార్లకు, అధికార లాలసులకు వెర్రితలలు వేసే అవకాశం ఇస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సేవాభావాన్ని హరిస్తూ, బాబా అభిప్రాయాలను పక్కకు తోసేస్తూ వారు వ్యవహరిస్తున్న తీరు ప్రశాంతి నిలయాన్ని అశాంతి నిలయంగా మార్చేస్తోంది. తన ఉప్పు తింటూ కృతఘ్నతతో మసలే వీరి గురించి బాబా వాస్తవాలు బయట పెడితే ట్రస్టు పెత్తందార్ల ఆటలు సాగవు''

బాబాను మేమే తయారుచేశాం..

"కొందరు ట్రస్ట్ సభ్యులు, ట్రస్ట్ అధికారులు బాబా దైవత్వాన్ని ప్రైవేటు సంభాషణల్లో ఆమోదించరు. అనేక మంది మనుషుల్లో లేని కొన్ని ప్రత్యేక శక్తులున్న రత్నాకర సత్యనారాయణరాజుగా మాత్రమే బాబాను వారు పరిగణిస్తారు. అలాంటి సత్యనారాయణ రాజును సత్యసాయిబాబాగా తయారుచేసిందని తామేనని చెప్పుకుంటూ ఉంటారు. బాబా పని అయిపోయిందని ఇటీవల ప్రశాంతి నిలయం పెత్తందార్లు బాహాటంగానే అంటున్నారు''.

అక్రమాలు చేసేది వీరే..

"సాయి సెంట్రల్ ట్రస్ట్ విధులేమిటో, నిధులు ఎన్ని ఉన్నాయో తెలియదు. ట్రస్ట్ సెక్రటరీ నారాయణన్, మెయిన్ అడ్మినిస్ట్రేటర్ కల్నల్ జోగిరావు పుట్టపర్తిలో ఉండి అన్ని వ్యవహారాలు చూసుకుంటారు. ట్రస్ట్ సభ్యులైన శ్రీనివాసన్, ఇందూలాల్ షాల వత్తాసు వీరికి ఉంది. వీరందరూ కలిసి సేవాదళ్ కార్యకర్తల్లో కొందరిని లోబరుచుకొని ప్రశాంతి నిలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారు''

బాబాకి తెలిసే అవినీతి..

"1986లో నేను (ప్రభు) బాబా ఆశ్రమంలోకి వెళ్లాను. ఏ విధులు నిర్వహిస్తావని బాబా అడిగారు. గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు అప్పగించాలని అడిగా. 'అక్కడ ఏముంది.. అవినీతి.. అవినీతి.. అవినీతి' అని బాబా వ్యాఖ్యానించారు. ఆశ్రమంలో ఉండు. తర్వాత చూద్దాం అన్నారు.

ఆశ్రమం సమీపంలో ఉన్న చలపతిరావు దుకాణం స్థలాన్ని ట్రస్ట్ ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలనుకుంది. ఈ విషయం చలపతిరావు చెప్పుకున్నప్పుడు - ' నీ స్థలం మాకు అవసరం లేదు' అని బాబా స్వయంగా చెప్పారు. అయినప్పటికీ ట్రస్ట్ పెద్దలు రెవెన్యూ అధికారుల ద్వారా షాపు మూసేయాలని నోటీసు ఇప్పించారు. ఆ షాపుకు వెళ్లే భక్తులపై వలంటీర్లు చేయి చేసుకోవటంతో ఎవరూ వెళ్లటం లేదు''.

ట్రస్ట్ అక్రమాలు..

"హైదరాబాద్‌లో కళ్యాణ మండపం కట్టడం కంటే ఆ నిధులను ఒక ఫండ్‌గా రూపొందించి దానిపై రాబడులతో విస్తృతమైన సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేది బాబా అభిమతం. అలాగే పుట్టపర్తిలో ఆయుర్వేద వైద్యశాల మాత్రమే విస్తృత ప్రాతిపదిక మీద ఏర్పాటు చేయాలనేది ఆయన ఆలోచన. ఇందుకు భిన్నంగా కళ్యాణమండపాన్ని, అలాగే అల్లోపతి విధానంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ట్రస్ట్ నిర్మింపచేసింది. సంపన్నుల నుంచి, విదేశీయుల నుంచి భారీగా విరాళాలు సేకరించి వీలైనంత కైంకర్యం చేయటానికే బాబా అభీష్టానికి వ్యతిరేకంగా ఈ నిర్మాణాలు చేపట్టారు''

ఆర్థిక అక్రమాలు..

"దేశ, విదేశాల నుంచి భక్తులు రోజూ బాబాకు లేఖలు రాస్తారు. కార్యక్రమాల కోసం విరాళాలు పంపుతారు. ఇక ప్రశాంతి నిలయానికి స్వయంగా వచ్చి విరాళాలు ఇచ్చే భక్తులు కూడా ఉన్నారు. ఒక రోజులో ఎంత మొత్తం సొమ్ము వస్తోంది? వాస్తవంగా అందులో ఎంత సొమ్ము ట్రస్టుకి జమ అవుతోంది అన్న విషయం ఒక బాధ్యతాయుతమైన ఏజెన్సీ ఏదైనా పరిశీలిస్తే అక్రమాలు బయటపడతాయి. చెక్కుల రూపంలో కాకుండా ట్రావెలర్స్ చెక్కుల రూపంలో విరాళాలు ఇవ్వాలని ట్రస్టు అధికారులు భక్తుల్ని ఒత్తిడి చేస్తుంటారు. దీనికి కారణం ఆ సొమ్ము లెక్కల్లో చూపించకుండా కైంకర్యం చేయటానికి వీలు ఉండటమే''.

అయ్యప్ప భక్తులపై వివక్ష

"అయ్యప్ప స్వామి భక్తులను ప్రశాంతి నిలయంలోకి ట్రస్టు అధికారులు అనుమతించటం లేదు. విశ్వప్రేమను ప్రబోధించే బాబాకు వ్యత్యాసాలు, వివక్షలు లేవు. ఎన్నో సందర్భాల్లో ఆయన ఈ విషయాలు స్పష్టంగా చెప్పారు. అయినా ట్రస్ట్ అధికారులు అయ్యప్ప భక్తులను అనుమతించలేదు. గేటు వెలుపలే ఉండిపోయిన భక్తులను స్వయంగా గమనించిన బాబానే లోనికి రప్పించారు''.

వీరే పూనుకోవాలి..

"బాబా భక్తులు, పత్రికలు, పౌరహక్కుల సంఘాలు, న్యాయవ్యవస్థ తలుచుకుంటే ప్రశాంతి నిలయంలో దారుణాలు వెల్లడి కావడం పెద్ద సమస్యకాదు''

--

1 comment:

  1. full story at:

    https://www.andhrajyothy.com/mainnewsshow.asp?qry=2011/may/2/main/2main2&more=2011/may/2/main/main&date=5/2/2011

    ReplyDelete