Tuesday, 3 May 2011

దేవాంతకులు-4: సాయిపైనే పెత్తనం

దేవాంతకులు-4: సాయిపైనే పెత్తనం
పేరు బాబాది.. అధిపత్యం ట్రస్టుది.. ఏనాడో గమనించిన సత్యసాయి

ట్రస్టును రద్దు చేసే యత్నం.. ఆస్తులు వేరే సంస్థకు అప్పగించే యోచన
అడ్డుకున్న ఇందూలాల్.. బాబుకు ప్రత్యామ్నాయం కోసం ట్రస్టీల ప్లాన్
మరొకరిని ఎన్నుకునేలా రూల్స్‌లో మార్పు..
ఈ హంగులు, ఆర్భాటాలు నాకు నచ్చవు. వీటి నుంచి నాకు ఎటువంటి ఆనందం కలగదు. ఈ మధ్య కాలంలో యోగులు, స్వాముల్లో కూడా ఇటువంటి ఆడంబరాలు ఫ్యాషన్ అయిపోయాయి. పేదరికం గురించి, నిరాడంబరత గురించి వీరు మాట్లాడతారు. తమ శిష్యులు ఆడంబరాల మీద ఖర్చు పెట్టడాన్ని అనుమతిస్తూ ఉంటారు... ప్రోత్సహిస్తారు కూడా. ఇటువంటి చర్యల వల్ల స్వాముల్లోనూ, వారి భక్తుల్లోనూ ఈగో పెరుగుతుంది. ఆడంబరాల వల్ల అసలు విషయం మరుగున పడిపోతుంది.
- 1963 డిసెంబర్ 14న సాయిబాబా

ఒకప్పుడు ప్రశాంతి నిలయం చిన్న భవంతి. సాయిబాబా ఆడంబరాలకు వ్యతిరేకి. అటువంటి ప్రశాంతి నిలయం ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారుమయం. స్వర్ణ సింహాసనాలు, మణిమయ వాహనాలు... సాయి చుట్టూ అంతా సంపదే. ప్రశాంతి నిలయం కొన్నివేల కోట్ల రూపాయలకు ఆలయం ఎలా అయింది? ఇదంతా బాబా ఇష్టంతోనే జరిగిందా? నిరాడంబరత గొప్పతనాన్ని పదే పదే ప్రవచించిన సాయిబాబా తన పేరిట ట్రస్టు కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారు?

ట్రస్ట్ పేరిట సంపాదించిన సంపద ద్వారా లాభం పొందిందెవరు? సత్యసాయిని బందీగా చేసి- "నన్నే ట్రస్టు నుంచి బయటకు పంపేసేలా ఉన్నార''ని ఆయన ఆవేదన చెందేలా చేసింది ఎవరు? అనే ప్రశ్నలు ఉదయించకమానవు. వీటికి సమాధానాలు వెదికితే కఠోర వాస్తవాలు బయటపడతాయి. ఒక దశలో ట్రస్టునే రద్దు చేయాలని సాయి భావించారని, కానీ ట్రస్టు సభ్యులు కుదరనీయలేదనేది ఒక వాస్తవం. ఇక ట్రస్టుతో తనకు సంబంధం లేదనుకుని, భక్తులే తన ఆత్మీయులుగా భావించి బాబా చివరిదశలో ట్రస్టుకు చాలా దూరం జరిగిపోయారన్నది మరో వాస్తవం.

సత్యసాయికి లక్షల మంది విదేశీ భక్తులు ఉండేవారు. వారు ప్రశాంతి నిలయానికి వచ్చి ఆ«ధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ సమయంలోనే వారు పుట్టపర్తి సమీప ప్రాంతాలను కూడా సందర్శిస్తూ ఉండేవారు. మన దేశంలో పేదరికం, నిరక్ష్యరాస్యత మొదలైనవి చూసి కలత చెంది, పరిస్థితులు మెరుగుపరచటానికి విరాళాలు ఇవ్వటానికి సిద్ధపడేవారు. ఈ విషయాన్ని గమనించిన సాయి ట్రస్టు ఈ విరాళాలను సేకరించి వివిధ సేవా కార్యక్రమాలకు ఉపయోగించటం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో అనేక స్కూల్స్ వెలిశాయి.

ఈ విరాళాలతో పాటుగా సత్యసాయికి విదేశీ భక్తులు కోట్లాది రూపాయలు ట్రావెలర్స్ చెక్కుల రూపంలోను, కరెన్సీ రూపంలోను పంపుతూ ఉండేవారు. ఇలాంటి సొమ్ములు లెక్కలు చూపాల్సిన అవసరం లేనందున ట్రస్టు సభ్యులు కూడా దీనినే ప్రోత్సహించేవారు. దీనితో లెక్క లేనంత ధనం ప్రశాంతి నిలయానికి వచ్చి చేరటం మొదలుపెట్టింది. ఈ సొమ్మును సాయి ఒక్కరే నియంత్రించలేరు కాబట్టి ఆయన తన సన్నిహితుల మీద, ట్రస్టు సభ్యులపైన ఆధారపడటం మొదలుపెట్టారు.

కొన్నిసార్లు సాయి ఆధ్యాత్మిక విషయాల వల్ల ఆర్థికపరమైన లావాదేవీలను అంతగా పట్టించుకొనేవారు కాదు. ఇదే ట్రస్టు సభ్యులకు వరంగా మారింది. డాలర్ల రూపంలో వచ్చిన కరెన్సీని పుట్టపర్తిలో ఉన్న కొందరు కాశ్మీరీ వ్యాపారులకు ఇచ్చి వారు రూపాయల రూపంలోకి మార్చుకొనేవారు. ఇదే విధంగా కొన్ని ట్రావెలర్స్ చెక్కులను కూడా మార్చి సొమ్మును తీసుకొనేవారు. ఈ అవినీతి 1986-87ల నాటికి సాయి ట్రస్టులు నిర్వహించే అన్ని కార్యక్రమాలలోకీ పాకింది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో అందినంత తినేయటం మొదలుపెట్టారు. ఈ విషయం బాబాకు తెలుసు.

అందుకే సురేష్ ప్రభుతో- 1987లో బాబా- "అక్కడ ఏముంది.. అంతా అవినీతి .. అవినీతి.. అవినీతి..'' అని వ్యాఖ్యానించినట్టు సమాచారం. ఈ విషయం బాబాకు తెలిసిన తర్వాత కూడా ట్రస్టు సభ్యులు ఏ మాత్రం జంకలేదు. తమకు కావాల్సిన వారికి వాహనాలను సమకూర్చటం, ముఖ్యమైన కార్యక్రమాల పర్యవేక్షణను అప్పగించటం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే ట్రస్టులోని బాబా కుటుంబ సభ్యులకు, ఇతరులకు మధ్య విభేదాలు ముదిరిపోయాయి.

ట్రస్టు సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొనే స్థితి ఏర్పడింది. దీనితో ప్రశాంతి నిలయం పరువును కాపాడాల్సిన బాధ్యత బాబాపై పడింది. ఏ వర్గాన్నీ సమర్థించలేక, వ్యతిరేకించలేక బాబా మౌనం వహించడం మొదలుపెట్టారు. "ప్రశాంతి నిలయమే పీకల దాకా అవినీతిలో కూరుకుపోయింది. వీళ్లంతా భౌతిక, లౌకిక ప్రయోజనాల కోసమే నా చుట్టూ చేరారు. ఈ ఆస్తులేమీ నావి కావు. ఏదో ఒక రోజు ట్రస్టు నన్నే బయటికి పంపేయవచ్చు..'' అని బాబా ఒక దశలో తన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు అనుకున్నంతా అయింది.

ట్రస్టులో గొడవలు 1993లో కాల్పుల సంఘటనకు దారి తీశాయి. ఎప్పుడూ ట్రస్టులో ఉన్న అంతర్గత విభేదాల గురించి బయటకు చెప్పని సాయిబాబా తమ్ముడు జానకి రామయ్య కూడా - "నాకు కానీ బాబాకు కానీ తెలియకుండా ట్రస్టు సభ్యులు కానీ వారి అనుచరులు కానీ ఏవైనా అక్రమాలు చేశారేమోనని నాకు కూడా అనుమానం కలుగుతోంది. ట్రస్టు సభ్యులైనా సరే అక్రమాలు చేసి ఉంటే వదిలే ప్రసక్తి లేదు'' అని వ్యాఖ్యానించారు.

ట్రస్టులో విభేదాలు లేవన్న ప్రకటనల్లోని డొల్లతనమేమిటో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. కాల్పుల సంఘటన తర్వాత బాబా కూడా ట్రస్టు సభ్యుల మధ్య విభేదాలను తీవ్రంగా పరిగణించారు. ఏదో ఒక మందు వేయకపోతే వ్యాధి శరీరాన్నే కబళిస్తుందని ట్రస్టుకు సంబంధించిన నిబంధనలలో మార్పులు చేశారు.

కీలకమైన మార్పు ఇదే..

సత్యసాయి ట్రస్టు నిబంధనలలో - ఆస్తులను ఏం చేయాలనే విషయం గురించి కానీ, ఒక వేళ ట్రస్టు రద్దు అయితే ఏం చేయాలనే విషయంపై కానీ ఎలాంటి ప్రస్తావనా లేదు. ఆ విధమైన చర్చ కూడా ఎప్పుడూ జరగలేదు. కాల్పుల సంఘటన తర్వాత రెండు వర్గాల మధ్య విభేదాలు ముదిరాయని గమనించిన సాయి ట్రస్టును రద్దు చేయాలనే ఆలోచన చేశారు. ఒకవేళ ట్రస్టును రద్దు చేస్తే దాని ఆస్తులను ఏం చేయాలో కూడా ఆలోచించారు.

ట్రస్టు నిబంధనల్లో ఒక కొత్త నిబంధనను చేర్చారు. "ఒక వేళ ట్రస్టును ఎప్పుడైనా రద్దు చేస్తే- దానికి సంబంధించిన ఆస్తులన్నీ - ట్రస్టు ఏవైతే కార్యకలాపాలు నిర్వహిస్తోందో అటువంటి కార్యక్రమాలు నిర్వహించే భావసారూప్యం గల సంస్థకు చెందుతాయి'' అనేది ఈ నిబంధన. సాయి ట్రస్టు అధ్యక్షుడు, వ్యవస్థాపకుడు అయిన సాయిబాబాకు- ఏ సభ్యుడినైనా నియమించే, తొలగించే అధికారం ముందు నుంచీ ఉంది. ఈ నిబంధనను మరింత బలోపేతం చేయటానికి, కుమ్ములాటలు ఆపకపోతే మొత్తం ట్రస్టునే రద్దు చేస్తాననే సంకేతాన్ని పంపటానికి సాయి ఈ మార్పులు చేశారు.

చక్రం తిప్పిన షా

ట్రస్టును రద్దు చేయాలని బాబా తీసుకున్న నిర్ణయం - సభ్యులకు శరాఘాతమైంది. నిబంధనల్లో చేసిన మార్పుల వల్ల ట్రస్టును బాబా రద్దు చేస్తే మొత్తం సొమ్ము మరో సంస్థకు చేరుతుంది. ఆ సంస్థ ఏదో నిర్ణయించే అధికారం కూడా బాబాదే కాబట్టి మొత్తం సభ్యులందరూ నష్టపోతారు. ఈ సమయంలో ట్రస్టు సభ్యుడు ఇందులాల్ షా రంగంలోకి దిగారు.

ఆ సమయంలో ఇందులాల్‌షా సాయి ఇంటర్నేషనల్ చైర్మన్‌గా ఉండేవారు. విదేశాలలోని సాయి సంస్థలపై ఆయనకు గట్టి పట్టు ఉండేది. విరాళాలు ఎక్కువగా విదేశాల నుంచే వస్తాయి కాబట్టి ట్రస్టులో ఆయన కీలకపాత్ర పోషిస్తూ ఉండేవారు. ఇందూలాల్ షా మళ్లీ 'పరువు మంత్రాన్ని' సత్యసాయిపై ప్రయోగించారు. ట్రస్టు రద్దు కానీయకుండా చేశారు.

ఈ సందర్భంలో నరసింహన్ గురించి చెప్పుకోవాలి. నరసింహన్ ఒక ప్రముఖ జర్నలిస్ట్. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ మాజీ ఎడిటర్. బాబాకు చాలా సన్నిహితుడు. దాదాపు రెండు దశాబ్దాలపాటు బాబా భక్తుడిగా ఉన్నారు. అయితే ప్రశాంతి నిలయంలో జరుగుతున్న సంఘటనలపై నరసింహన్ తీవ్రంగా కలత చెందారు. అక్కడ తాను గమనించిన విషయాలన్నింటినీ నోట్స్ రూపంలో రాసుకున్నారు. నార్వేలోని సత్యసాయి ఇంటర్నేషనల్ సంస్థ శాఖాధ్యక్షుడు, సాయి సన్నిహితుడు అయిన రాబర్ట్ పిడ్రీ నరసింహన్‌కు కూడా సన్నిహితుడు.

తన నోట్స్‌లోని ముఖ్యమైన విషయాలను నరసింహన్ రాబర్ట్‌కు చెబుతూ ఉండేవారు. నరసింహన్ రాసుకున్న నోట్స్ చాలా కాలం బయటకు రాలేదు. బాబాకు భక్తుడిగా ఉన్న రాబర్ట్.. ట్రస్ట్‌లో తన బాధ్యతలను పరిత్యజించిన తర్వాత - ఈ నోట్స్‌ను బయటపెట్టారు. రాబర్ట్ ఆన్‌లైన్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... "ట్రస్టులో కీలకమైన వ్యక్తి సాయిబాబా అని.. ఆయనే అన్ని నిర్ణయాలు తీసుకుంటారనే ప్రచారం ఉంది. కానీ ఇది నిజం కాదు. 1983-2000 సంవత్సరాల మధ్యలో మాజీ రాజకీయవేత్త ఇందూలాల్ షా కీలకమైన పాత్ర పోషించేవారు. ట్రస్ట్ ఇంటర్నేషనల్ చైౖర్మన్ కూడా ఆయనే.

ఆ సమయంలో సాయిబాబా మొత్తం ట్రస్ట్‌ను రద్దు చేయాలని ప్రయత్నించారు. ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు. అయితే ఇందూలాల్ షాకు దేశ, విదేశాలలో సాయిసంస్థలపై గట్టి పట్టు ఉంది. సాయిబాబా ప్రకటనను ఆయన పట్టించుకోలేదు. ఏమీ జరగనట్లే కార్యకలాపాలు నిర్వహించారు. ఈ విషయాలన్నింటి గురించి నరసింహన్‌కు తెలుసు. విదేశాలలో ఉన్న మహారాష్ట్రీయుల ద్వారా సాయిబాబా ఆదేశాలు పూర్తిగా తిరగబడేలా ఇందూలాల్ షా చేయగలిగాడని నరసింహన్ తన నోట్స్‌లో పేర్కొన్నారు'' అని వెల్లడించారు.

దూరం జరిగిన బాబా

ట్రస్టు సభ్యుల తీరులో మార్పు లేకపోవటం గమనించిన బాబా ట్రస్టు నుంచి క్రమేపీ దూరంగా జరగటం మొదలుపెట్టారు. "సాయి సెంట్రల్ ట్రస్టు సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశంలో శ్రీ ఇందులాల్‌షాతో సహా అందరికి ఆస్తుల పట్ల నాకు ఎటువంటి ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పాను. ఈ ఆస్తుల విషయంలో నా ప్రమేయం లేకుండా చూడమన్నాను. ధనం విషయంలో కానీ ఆస్తుల విషయంలో కానీ ఎటువంటి సంబంధం ఉండాలని నేను కోరుకోవటం లేదు.

నా దృష్టంతా నా భక్తులపైనే..'' అని 1998లో బాబా పేర్కొన్నారు. 2000 సంవత్సరం తర్వాత సత్యసాయి సంస్థల కార్యక్రమాల జోరు క్రమేపీ తగ్గటం ప్రారంభించింది. వయస్సు మీద పడటంతో బాబా ముందంత చురుకుగా కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయేవారు. దీనితో మొత్తం వ్యవహారమంతా ట్రస్టు చేతిలోకి వచ్చేసింది. ఈ సమయంలో పేరు బాబాది. పెత్తనం మాత్రం ట్రస్టుది.

మార్చేసిన ఘనులు

గత ఏడాది బాబాకు ప్రమాదం జరిగింది. నడుము తుంటి దగ్గర ఎముక విరిగింది. దీనితో సాయి కేవలం వీల్ చైౖర్‌కు మాత్రమే పరిమితమయ్యారు. భక్తులకు దర్శనాలు ఇవ్వటం కూడా తగ్గించారు. ఈ సమయంలోనే నిబంధనలను మరోసారి మార్చారు. వీటి ప్రకారం బాబా ఎప్పటికీ వ్యవస్థాపక ట్రస్టీగానే ఉంటారు. ఒకవేళ బాబా ఆ పదవిని నిర్వహించటానికి ఇష్టం లేకపోయినా, నిర్వహించలేని పరిస్థితులు తలెత్తినా- ఆయన స్థానంలో మరో వ్యక్తిని ఎన్నుకొనే అధికారం ట్రస్టీలకు ఉంటుంది.

వీటి ప్రకారమే అతి త్వరలో ట్రస్టీలు కొత్త చైర్మన్‌ను ఎన్నుకోవటానికి రంగం సిద్ధమయింది. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే- ఈ మార్పులు జరిగిన విషయాన్ని అతి రహస్యంగా ఉంచడం. అంటే బాబా మరణానంతరం ట్రస్టు తమ చేతుల్లోనే ఉండేలా ట్రస్టు సభ్యులు అన్ని రకాలుగా ప్రణాళికను ముందే సిద్ధం చేసుకున్నారన్న మాట!

No comments:

Post a Comment